బెంగళూరు: పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆగస్టు 1 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు బెంగళూరు మేయర్ గంగంబైక్ మల్లికార్జున్ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నిబంధనను ఏకంగా మేయర్ ఉల్లంఘించడం చర్చనీయాంశమైంది. ఇటీవల కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యెడియూరప్పకు మేయర్ గంగంబైక్ పండ్ల చుట్టూ ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉన్న బుట్టను ఇచ్చారు. ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నిబంధనలు పాటించకపోయిన మేయర్కు మున్సిపల్ అధికారులు రూ.500 జరిమానా విధించారు. రూల్ను ఉల్లంఘించడంపై క్షమాపణలు చెబుతూ జరిమానా మొత్తాన్ని ఆమె చెల్లించారు. 2016 నుంచి బెంగళూరు నగర పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు.