ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎఫ్ సెటిల్‌మెంట్లకు మొబైల్ యాప్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2017, 10:33 AM

ఖాతాలనుంచి డబ్బు తీసుకోవడానికి ఇప్పటికే అనేక సరళతర మార్గాలు ప్రవేశపెట్టిన పీఎఫ్.. త్వరలోనే ఉమంగ్ అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనున్నది. దీనిసాయంతో పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, ఖాతా మార్పు వంటి సేవలు పొందవచ్చు. లోక్‌సభలో  సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సమాధానమిస్తూ.. “ఖాతానుంచి నగదు ఉపసంహరణకు సంబంధించి ఆన్‌లైన్ క్లెయిమ్‌లను ఈపీఎఫ్‌వో సంస్థ స్వీకరిస్తున్నది. ఈ మేరకు అధునాతన వ్యవస్థను సంతరించుకున్నాం. త్వరలోనే కొత్తతరానికి ఉపయోగపడేలా మొబైల్ యాప్- ఉమంగ్‌ను అందుబాటులోకి తెస్తున్నాం” అని చెప్పారు. అయితే, అది ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందో త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సాంకేతిక అభివృద్ధి సంస్థ సీ-డాక్‌తో కార్మికశాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నదని.. పీఎఫ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల రూపకల్పనలో ఆ సంస్థ సహకరిస్తున్నదని చెప్పారు. అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఢిల్లీ, గురుగ్రామ్, సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయాల్లో ఏర్పాటు చేశామని, పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే.. దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని తెలిపారు. మరోప్రశ్నకు దత్తాత్రేయ సమాధానమిస్తూ.. పీఎఫ్ ఖాతాలకు ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేయడం తప్పనిసరి చేశామని.. మార్చి 31కల్లా 1.68 కోట్లమంది ఖాతాదారులు ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా 123 భవిష్యనిధి ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని, ఇందులో 110 కేంద్రాలు కేంద్ర సర్వర్‌తో అనుసంధానం అయ్యాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నగదు ఉపసంహరణ, ఖాతాల మార్పులు, చనిపోయిన ఖాతాదారుడికి బీమా సొమ్ము చెల్లింపులకు సంబంధించి దాదాపుగా కోటి దరఖాస్తులు భవిష్యనిధి కార్యాలయాలు అందాయని చెప్పారు. ఆన్‌లైన్ ప్రక్రియ మే నెల వరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని.. అప్పుడు అన్ని సేవలు అన్‌లైన్‌లో కూడా అందిస్తామని ఈపీఎఫ్‌వో అధికారులు వెల్లడించారు. దరఖాస్తులను పరిష్కరించేందుకు ఇప్పటివరకు గరిష్ఠంగా 20 రోజుల వ్యవధిని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా ఆన్‌లైన్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో దరఖాస్తులను మూడు గంటల్లోనే పరిష్కరించే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com