అమరావతి : ఏపీలోని పలు మునిసిపాలిటీలలోని వార్డులకు జరిగిన ఉపఎన్నికలలో తెలుగుదేశం మెజారిటీ వార్డులలో విజయం సాధించింది. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కృష్ణా, గుంటూరు, కడప, విజయనగరం, విశాఖ జిల్లాలలోని పలు మునిసిపాలిటీలలో వివిధ వార్డులకు ఉపఎన్నికలు ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. మంగళగిరి మునిసిపాలిటీలో వార్డుకు జరిగిన ఉపఎన్నికలో వైకాపా విజయం సాధించింది. మాచర్ల, గుడివాడ, పలమనేరు, హిందూపురం, తాడిపత్రి, ఆత్మకూరులలో వార్డులకు జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కడప లో రెండు వార్డులకు జరిగిన ఉపఎన్నికలలో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. వార్డులకు జరిగిన ఉప ఎన్నికలలో తెలుగుదేశం పై చేయి సాధించినప్పటికీ రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో పరాజయం కావడం మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు.