లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈమేరకు ఇప్పటికే పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఆయన ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే ఆయన రాజీనామా ప్రతిపాదనను సీడబ్ల్యూసీ తిరస్కరించినట్టు చెబుతున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవద్దంటూ ఆయనను ఒప్పించేందుకు అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తూర్పు యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంక గాంధీ తదితరులు కూడా ఆయన రాజీనామా చేయకుండా ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాహుల్ రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను రాహుల్కే అప్పగించామని..అతని నాయకత్వంలోనే పార్టీ ముందుకెళ్తుందని పార్టీ నాయకులు వివరించారు.!