లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.టీవీ డిబేట్స్ కోసం పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించబడిన పానలిస్టులందరినీ తొలగిస్తూ అఖిలేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు శుక్రవారం(మే-24,2019)పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి ఓ లెటర్ ను విడుదల చేశారు.ఇప్పటినుంచి పానలిస్టులందరి నియామకం ముగిసిందని తెలిపారు.టీవీ చానల్స్ లో చర్చల కోసం పార్టీలోని ఏ ఒక్క ఆఫీస్ బేరర్ ను ఆహ్వానించవద్దని తాము కోరుతున్నట్లు తెలిపారు.తదుపరి పానలిస్టుల లిస్ట్ ను ఎస్పీ జాతీయ అధ్యక్షుడు డిసైడ్ చేస్తారని చౌదరి తెలిపారు.
అయితే ఎస్పీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించగా....ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం అని,కారణాలు వెల్లడించబోవడం లేదని చౌదరి తెలిపారు.ఎస్పీ వెబ్ సైట్ లోని లిస్ట్ ప్రకారం.... 24మంది ప్రతినిధులు టీవీ పానలిస్ట్ లుగా ఉన్నారు.లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ మోడీ హవాకు ఎదురొడ్డి నిలబడలేకపోయారు.ఎస్పీ కేవలం 5స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా,బీఎస్పీ 10 సీట్లతో సరిపెట్టుకుంది.