గుజరాత్లోని ఒక గ్రామ ప్రజలు ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించారు. అభ్యర్థులు ప్రచారానికి వస్తే ఈ ప్రాంతంపై దుష్ప్రభావాలు పడతాయని వారు భావించి ప్రచారాన్ని నిషేధించారు. రాజసమధియాల గ్రామ ప్రజలు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ (విడిసి) రూపొందించిన నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటారు. దీనిని ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం, ఎన్నికల్లో ఓటు వేయకుండా నిరోధించడం వంటి చర్యలు తీసుకుంటారు. గ్రామ సర్పంచ్ అశోక్ భాయ్ వాఘేరా మాట్లాడుతూ ప్రచారం వల్ల ఇక్కడి వాతావరణం దెబ్బ తింటుందని చెప్పారు. సగంమంది ఒకవైపు వెళితే మరొక సగం మంది వేరొక వైపు వెళతారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకుని తమకు సహకరిస్తున్నాయని ఆయన అన్నారు.