ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొలంబోలో మరో రెండు చోట్ల పేలుళ్లు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2019, 03:16 PM

శ్రీలంక రాజధాని కొలంబోలో మరో చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. తాజాగా జరిగిన పేలుళ్లలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో శ్రీలంకలో కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈస్టర్ సండే ప్రార్థనల కోసం చర్చిలకు వచ్చిన భక్తులే లక్ష్యంగా ఉగ్రమూకలు బాంబు దాడులకు పాల్పడ్డాయి. ఆదివారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో తొలి పేలుడు చోటుచేసుకుంది. అనంతరం పలు చోట్ల జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 166 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనల్లో మరో 460 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని చర్చితో పాటు శాంగ్రిలా, సిన్నామన్‌ గ్రాండ్‌, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. 


మరోవైపు, పేలుళ్లకు పాల్పడినవారిగా అనుమానిస్తోన్న వారిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. బాంబు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే పేర్కొన్నారు. ఈ సమయంలో శ్రీలంక ప్రజానీకం అంతా కలిసికట్టుగా ఉండాలని, వదంతులను నమ్మొవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టిందని, పరిస్థితి సాధారణ స్థాయికి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. 


కాగా, వరుస బాంబు పేలుళ్ల వెనుక అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ఐసిస్ హస్తమున్నట్లు శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. ఐసిస్‌కు చెందిన ఆత్మాహుతి దళ సభ్యులే ఈ దాడులకు కారణమని శ్రీలంక భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు ప్రాంతాల్లో ఐసిస్ సభ్యులే ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారని ధ్రువీకరించినట్లు ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు. జహ్రెయిన్ అనే ఉగ్రవాది పర్యాటకునిగా షాంగ్రిలా హోటల్‌‌లోకి ప్రవేశించి, అనంతరం అక్కడ తనను తాను పేల్చేసుకుని ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. బాట్టికలోవాలోని చర్చిపై మరో ఉగ్రవాది అబు మహ్మద్‌ దాడికి పాల్పడినట్టు గుర్తించారు. పర్యాటకుడి రూపంలో చర్చి వద్దకు వెళ్లి ఉంటాడని అనుమానిస్తున్నట్లు శ్రీలంక అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. 


ఇక, బాంబు దాడుల గురించి పది రోజుల కిందటే పోలీసులు అప్రమత్తం చేశారు. ఆత్మాహుతి దాడికి ప్రణాళికలు జరుగుతున్నాయని ఏప్రిల్‌ 11న శ్రీలంక పోలీసు ప్రధానాధికారి పుజుత్‌ జయసుందరకు సమాచారం అందింది. దీంతో ఆయన ఇంటెలిజెన్స్‌ వర్గాలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు అదే రోజు ఇంటెలిజెన్స్‌ అధికారులతో ఆయన సమావేశం కూడా నిర్వహించారని ఓ మీడియా తెలిపింది. ‘నేషనల్‌ తోహీత్‌ జమాత్‌ (ఎన్‌టీజే)’ అనే సంస్థ దేశంలో ఆత్మాహుతి దాడికి వ్యూహ రచన చేస్తోందని విదేశీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com