తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఓ ఆలయ ఉత్సవంలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు సహా ఏడుగురు భక్తులు మృతి చెందారు. తురైయూర్ సమీపంలోని ముత్యంపాలయంలో ఉన్న కరుప్పనస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్ర పౌర్ణమి ఉత్సవంలో భాగంగా నాణేల పంపిణీ జరిగినప్పుడు క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. మృతులను ఆర్.లక్ష్మీకాంతం (60), కె.రాజవేల్ (55), ఎస్.గాంధయీ (38) , ఎ.శాంతి (50), రామర్ (50), వి.పూంగవనం (50), ఆర్.వల్లి (35)గా గుర్తించారు. వీరంతా కరూర్, కడలూరు,సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందిన వారు. ఆలయంలో ఏటా ఘనంగా జరిగే ఉత్సవం కావడంతో ఆదివారంనాడు భక్తులు పోటెత్తారు.