సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టి.. దేశ భవిష్యత్ కోసమే మళ్లీ ఎస్పీ - బీఎస్పీ చేతులు కలిపాయని మాయావతి స్పష్టం చేశారు. మెయిన్పూరిలో ములాయం సింగ్ యాదవ్ తరపున నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాయావతి పాల్గొని ప్రసంగించారు. దేశ భవిష్యత్ కోసం కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మెయిన్పూరిలో ములాయం సింగ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన వర్గాలు ములాయం తమ నాయకుడిగా భావిస్తున్నాయి. సమర్థులు, అసమర్థులు ఎవరో గుర్తించి ప్రజలు ఎన్నుకోవాలి. వెనుకబడిన వర్గాల కోసమే ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఆలోచిస్తాయి. వెనుకబడిన వర్గాల కోసం మోదీ చేసిందేమీ లేదు. ఈ ఎన్నికల్లో మోదీ నాటకాలు, అబద్ధాలు చెల్లవు అని మాయావతి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. దేశ వ్యాప్తంగా తిరుగుతూ.. వెనుకబడిన వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని హామీ ఇస్తుంది. కాంగ్రెస్, బీజేపీ వల్ల పేదలకు న్యాయం జరగదు. తాము అధికారంలోకి వస్తే పేదలకు, వెనుకవడిన వర్గాలకు తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని హామీ ఇస్తున్నానని మాయావతి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయం. ములాయం సింగ్కు సరైన వారసులు అఖిలేష్ యాదవే అని మాయావతి స్పష్టం చేశారు.