పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ తిరిగి విజయం సాధించడం ఖాయమని కేంద్ర మంత్రి సదానంద గౌడ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పార్లమెంట్ బీజేపీ పార్టీ బూత్ స్ధాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హజరయ్యారు. వరంగల్ బీజేపీ అభ్యర్ధి చింత సాంబమూర్తిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. 2014 ఎన్నికలకు ముందు ప్రపంచం మొత్తం దేశంవైపు చూసిందన్నారు. 'ఇక్కడ పాలించేది ఎవరూ.. దేశాన్ని ఎలా నడిపిస్తారు అని. మోడీ ప్రభుత్వం వచ్చాక ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటి స్థానంలో భారత్ ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయింది. మోడీ వచ్చాక ఒక్క అవినీతి కేసు కూడా లేదు. పుల్వామా ఘటనను తిప్పి కొట్టిన వైనం అందరం చూసాం.. ఇది మోదీ ఘనత.
సైనిక, రక్షణ బలగాలకు మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ ను మట్టు బెట్టడానికి అమెరికాకు 11 సంవత్సరాలు పట్టింది. మోడీ మాత్రం 11 రోజులలో ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించారు. 5 ఏళ్లలో చేసిన పనులనే ప్రజల ముందు ఉంచుతున్నాం. పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పధకం ప్రవేశపెట్టాం. దురదృష్టవశాత్తు తెలంగాణలో అమలు కావడం లేదు. కేంద్రం పేదలకు అందిస్తున్న పధకాలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గెలుపు ఖాయం కాబట్టి.. మనం కూడా బీజేపీ గెలుపు కోసం పాటుపడాలి. కేంద్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో అనేక పథకాలు తీసుకవచ్చారు. పేద మధ్యతరగతి ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మోడీ' అని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు.