బెంగళూరు: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నోటీసులు పంపింది. న్యాయవాది ఎం.ఎల్.శర్మ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖెహర్ సారథ్యంలోని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, సంజయ్ కిషన్ కౌల్తో కూడిన ధర్మాసనం ఈసీకి ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసి విచారణ జరపాలని శర్మ వాదించారు. అయితే ఈ వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. యూపీలో తమ పార్టీ ఫలితాలు దారుణంగా ఉండటానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపణలు చేసిన వారం తర్వాత తాజా పిల్ దాఖలైంది. మాయావతి ఆరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం సమర్ధించారు. పంజాబ్లో ఆప్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయని, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఆప్కు చెందిన 20 నుంచి 25 శాతం ఓట్లు శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమికి బదిలీ అయ్యాయని ఆయన ఆరోపించారు. కాగా, తాజా కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.