ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైల్వేస్టేషన్లో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది. ఢిల్లీలోని కశ్మీరీ గేట్ మెట్రో రైల్వేస్టేషన్లో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది కథనం ప్రకారం గుర్తు తెలియని మహిళ ఫ్లాట్ఫాం నంబర్ రెండులోని స్టోర్రూములోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం స్టోర్రూమ్ని శుభ్రపరిచేందుకు స్వీపర్ లోపలికి వెళ్లగా.. అక్కడ మహిళ పైపునకు వేలాడుతుండటాన్ని గమనించి సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో ఆమెను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మహిళ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ స్టోర్ రూంలోకి కేవలం సిబ్బంది మాత్రమే వెళ్తారని.. దీంతో ఎవరూ మహిళను గమనించలేదని పోలీసులు చెప్పారు. మహిళ వద్ద ఎటువంటి ఆధారాలు దొరకలేదని.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.