లండన్: బ్రిటన్ పార్లమెంట్ సమీపంలో జరిగిన ఉగ్రవాద దాడుల కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బర్మింగ్హామ్ ప్రాంతంలో చేపట్టిన సోదాల్లో అనుమానితులుగా భావిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బుధవారం లండన్లో జరిగిన దాడుల్లో తొలుత ఓ దుండగుడు సహా అయిదుగురు చనిపోయినట్లు చెప్పారు. కానీ ఇప్పుడు ఓ దుండగుడు, ఓ పోలీసు అధికారి సహా నలుగురు చనిపోయినట్లు సవరించారు. దాడిలో నలభై మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. దాడిచేసిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. దీనిని ఉగ్రదాడిగానే పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు దుండగుడిని గుర్తించారు కానీ అతడి వివరాలు వెల్లడించలేదని బీబీసీ పేర్కొంది. దుండుగుడు సుమారు 40ఏళ్ల వయసులో ఉన్న ఆసియావాసి అని ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు మీడియా తెలిపింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.