పుల్వామా ఉగ్రదాడిపై భరతజాతి రగిలిపోతోంది. 46మంది జవాన్లు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అమరవీరుల త్యాగాలను స్మరించుకొని కన్నీళ్లు పెడుతోంది. అటు అమర జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. తమ వారిని తలచుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో అమరవీరుల కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పూనుకున్నారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి శామ్లికి వెళ్లారు. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్ 'అమిత్ కోరి' కోరిప కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం రఘునాథ్ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో పాల్గొన్నారు.
అమిత్ కోరి కుటుంబ సభ్యుల కన్నీళ్లను చూసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భావోద్వేగానికి లోనయ్యారు. తమ తండ్రి (రాజీవ్గాంధీ)ని కూడా ఇలాగే చంపేశారని కంట తడిపెట్టుకున్నారు. అమిత్ కుటుంబ సభ్యులతో ప్రియాంక గాంధీ మాట్లాడారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి..ఫోన్ నెంబర్ తీసుకున్నారు రాహుల్. ఈ సందర్భంగా అమిత్ అమర్ రహే..భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.అమిత్ కోరి నివాసం నుంచి మరో అమరజవాన్ ప్రదీప్ కుమార్ నివాసానికి వెళ్లారు రాహుల్, ప్రియాంక. వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చి ధైర్యం చెప్పారు. రాహుల్ వెంట వెస్ట్ యూపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జ్యోతిరాదిత్య సింధియా, యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్బబ్బర్ ఉన్నారు.
లక్నో నుంచి రోడ్డుమార్గంలోనే శామ్లికి వెళ్లారు. రాహుల్, ప్రియాంక గాంధీ శామ్లి పర్యటనను చివరి వరకు గోప్యంగా ఉంచారు కాంగ్రెస్ నేతలు. మార్గమధ్యలో కైరానా దగ్గర శివశక్తి దాబా దగ్గర టీ తాగారు.కాగా, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 46 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆదిల్ అహ్మద్ ఆత్మాహుతి దాడి చేశాడు. 300 కేజీలకు పైగా పేలుడు పదార్థాలు నింపిన కారుతో జవాన్లు కాన్వాయ్ని ఢీకొట్టాడు. అమరవీరుల్లో యూపీకి చెందిన జవాన్లు 12 మంది ఉన్నారు. వారిలో శామ్లి పట్టణానికి చెందిన జవాన్లు ఇద్దరు ఉన్నారు.