ఇండియా పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన భారత వైమానిక దళ మాజీ అధికారి కులభూషన్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ లోని న్యాయస్థానంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితికి అద్దం పట్టేలా ఓ సంఘటన చోటు చేసుకుంది. కేసు విచారణకు ముందు పాకిస్తాన్ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ మన విదేశాంగ మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి దీపక్ మిట్టల్ను కలిశారు. ఈ సందర్భంగా మన్సూర్ ఖాన్ మిట్టల్కు షేక్ హ్యాండ్ ఇవ్వబోగా.. ఇందుకు మిట్టల్ నమస్కారంతో సరిపెట్టేశారు. పుల్వామా దాడి ఘటన తర్వాత పాక్తో దౌత్య సంబంధాలు తెగిపోయాయని స్పష్టమైంది.
గూఢచర్యం ఆరోపణలతో 2016లో జాదవ్ను ఇరాన్ నుంచి జాదవ్ను పాక్ ఏజంట్లు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బలూచిస్థాన్లో ప్రవేశించినట్టు ప్రకటించారు. 2017 ఏప్రిల్లో పాకిస్థాన్ మిలిటరీ కోర్టు అతడికి మరణశిక్ష విధించగా.. ఇరాన్లో ఉంటున్న జాదవ్ను పాక్ కిడ్నాప్ చేసిందని భారత్ ఆరోపించింది. పాక్ విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ఇలా అంతర్జాతీయ వేదిక మీద పాకిస్థాన్తో భారత్ ఈ విధంగా వ్యవహరించడం ఇది రెండోసారి. గతంలో ఐసీజేలో పాక్ అధికారి కరచాలనాన్ని మన దేశపు అధికారి నమస్కారంతో తోసిపుచ్చారు.