ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు సంపాదించుకున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వద్ద బోలెడు నగలు, సంపద ఉండేవి. హైదరాబాద్ భారతదేశంలో విలీనమయ్యాక అతని సంపద కోసం వారసులు కాట్లాడుకున్నారు. చాలా సంపద దేశం దాటి పోగా, కొంత ప్రభుత్వ వశమైంది. అందులో కొన్ని నగలను అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు. 11 ఏళ్ల విరామం తర్వాత వాటిని ఈ రోజు నుంచి మళ్లీ ప్రదర్శనకు పెట్టారు.
ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఈ ప్రదర్శన మొదలైంది. మొత్తం 173 వస్తువులను ప్రదర్శిస్తున్నారు. వీటిలో కోహినూర్ వజ్రంకంటే రెండు రెట్లు పెద్దదైన జాకబ్ డైమండ్ అందర్నీ ఆకర్షిస్తోంది. 22 అన్సెట్ పచ్చల హారం కూడా కనువిందు చేస్తోంది. 28 షోకేసుల్లో వజ్రాలు, రత్నాలు, పచ్చలు హారాలు, పటాకాలు, బ్రాస్ లెట్లు, చెవిదుద్దులు, కంకణాలు, మెట్టెలు, ఉంగరాలు, ప్యాకెట్ వాచీలు వంటివి ఉన్నాయి. టిప్పుసుల్తాన్కు చెందినవిగా భావిస్తున్న భుజకీర్తులు మరో విశేషం. నిజాం నగలునట్రాలో కొంత భాగాన్ని భారత ప్రభుత్వం 1995లో రూ. 218 కోట్లకు కొనుగోలు చేసింది. తాజా ప్రదర్శన మే నెల 5 వరకు ఉంటుంది. సందర్శన వేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు వరకు. సోమవారాలు, జాతీయ సెలవుల్లో ప్రదర్శన ఉండదు. టికెట్ ధర రూ. 50.