ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వాములకు గుడ్‌న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 10:25 PM

కేరళలోని శబరిమలలో అయ్యప్ప దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు శబరిమలకు పోటెత్తుతున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలు, సొంత వాహనాలు.. ఇలా వివిధ రకాల మార్గాల్లో అయ్యప్ప కొండకు చేరుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా కనిపించే మకరజ్యోతి దర్శనం కోసం.. దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులతోపాటు సామాన్య ప్రజలు కూడా లక్షల్లో పోటెత్తుతుంటారు. ఇక ఇప్పటికే ప్రారంభం అయిన అయ్యప్ప దర్శనాలు.. జనవరి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయ్యప్ప మాల వేసిన భక్తులు.. శబరిమలకు వెళ్లి తమ ఇరుముడులను సమర్పించి.. మొక్కులు తీర్చుకుంటారు. అయితే అయ్యప్ప స్వామి ఇరుముడులను భక్తులు ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఈ ఇరుముడులకు సంబంధించి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.


వివిధ రాష్ట్రాల నుంచి విమానాల్లో కేరళకు చేరుకుని.. అక్కడి నుంచి వివిధ మార్గాల్లో భక్తులు శబరిమలకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలోనే అయ్యప్ప స్వాముల దగ్గర ఉండే పవిత్రమైన ఇరుముడులను విమానాల్లో ప్రయాణించే సమయంలో వారి వెంట తీసుకెళ్లే అవకాశాలు ఇప్పటివరకు లేవు. తమ లగేజీలతోపాటు ఇరుముడులను పంపించాల్సి ఉంటుంది. దీంతో అప్పటివరకు తమతోపాటే పరిరక్షించుకున్న ఇరుముడులను.. అయ్యప్ప స్వాములు తమ లగేజీతోపాటు పంపించేవారు. దీంతో అయ్యప్ప భక్తుల సమస్యలను గుర్తించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇరుముడితో శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తులు తమ వెంట విమానంలోని క్యాబిన్‌లోకి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.


అయ్యప్ప స్వాములతోపాటే ఇరుముడులను తీసుకెళ్లడం కోసం పౌర విమానయాన శాఖ నిబంధనలను సడలించినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ స్కానింగ్ తర్వాత భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్‌లోనే ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. శబరిమలలో ప్రస్తుతం జరుగుతున్న మండల పూజల నుంచి మొదలుపెడితే మకర జ్యోతి దర్శనం పూర్తయి.. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన జరిగే చివరి రోజు వరకు ఈ అవకాశాన్ని కల్పించినట్లు తెలిపారు. దీనికి అయ్యప్ప భక్తులు గుర్తించి.. ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి సహకరించాల్సిందిగా కోరుతున్నట్లు తాజాగా రామ్మోహన్ నాయుడు ఒక వీడియోను విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com