ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బయటకు వచ్చిన మరో లెటర్.. చెల్లెలు షర్మిలకు జగన్ భావోద్వేగ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 09:26 PM

వైఎస్ కుటుంబం ఆస్తి వివాదాల నేపథ్యంలో మరో లేఖ బయటకు వచ్చింది. గతంలో వైఎస్ జగన్.. చెల్లెలు షర్మిలకు రాసిన లేఖను వైసీపీ తన ఆధికారిక ఎక్స్ ఖాతా వేదికగా బయటపెట్టింది. వైఎస్ జగన్, షర్మిల ఆస్తి వివాదం నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లేఖను విడుదల చేస్తున్నట్లు వైసీపీ తెలిపింది. వైఎస్ జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయన్న వైసీపీ.. ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలనేదే తమ ఉద్దేశమని పేర్కొంది. మరోవైపు 2024 ఎనిమిదో నెల 27వ తేదీ ఈ లేఖను రాసినట్లుగా అందులో ఉంది. ఈ లేఖలో వైఎస్ జగన్ అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో ఏముందంటే..


"ప్రియమైన షర్మిల, ఇటీవల జరిగిన పరిణామాలతో కలత చెందిన నేను బరువైన హృదయంతో నీకు ఈ లేఖ రాస్తున్నా. మనకు ఎంతో ప్రేమను పంచిన మన తండ్రి బతికున్నప్పుడు, ఆయన సంపాదించిన, మన పూర్వీకుల ద్వారా సంక్రమించిన అన్నీ ఆస్తులను నిష్పాక్షికంగా, ధర్మబద్ధంగా, సమానంగా మన మధ్య పంపకం చేశారు. వారసత్వం ద్వారా సంక్రమించిన ఆస్తులతో ఎలాంటి సంబంధం లేకుండా నా చొరవ, శ్రమ, పెట్టుబడితో సొంతంగా నేను కొన్ని వ్యాపారాలను నిర్మించిన సంగతి కూడా నీకు తెలుసు. నా చెల్లిగా నేను ఎల్లప్పుడూ నీ పట్ల అవ్యాజ్యమైన ప్రేమ, ఆప్యాయతను చూపుతూ వచ్చాను. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం నీపై ఉన్న ప్రేమ, ఆప్యాయత దృష్ట్యా కొన్ని ఆస్తులను నీకు బదలాయించాలన్న నా అభిమతాన్ని నీకు స్పష్టంగా తెలియచేశాను."


 "భవిష్యత్తులో అవి నీకు చెందేలా చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా చెప్పాను. గత పదేళ్లలో అమ్మ ద్వారా లేదా నేను నీకు ప్రత్యక్షంగా ఇచ్చిన దాదాపు రూ.200 కోట్ల మొత్తానికి నేను నీకు ఇవ్వాలనుకున్న ఆ ఆస్తులు అదనం. ఇది కూడా నీ పట్ల నాకున్న అవ్యాజ్యమైన ప్రేమ, ఆప్యాయత కారణంతోనే నీకు ఇచ్చాను. నీకు మంచి చేయాలన్న నా ఈ సంకల్పాన్ని మరింత ధృడపరుస్తూ నేను ఆ ఎంవోయూపై సంతకం చేశాను. నీకు మేలు చేయాలనుకున్న నా ధృఢ సంకల్పానికి ఈ ఎంవోయూనే సాక్ష్యం. తోడబుట్టిన సోదరిగా నీ పట్ల నాకున్న ప్రేమ, ఆప్యాయతతోనే భవిష్యత్తులో నీకు ఈ ఆస్తులు దక్కే విధంగా ఎంవోయూపై సంతకం చేశాను."


"ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన పెండింగ్ కేసులన్నీ పరిష్కారమైన తర్వాతనే నీకు ఆస్తులు చెందేలా ఆ ఎంవోయూ రాశాను. ఆ పెండింగ్ కేసుల వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదన్నదే నా ప్రధాన అభిమతం. జప్తు చేసిన అన్నీ రకాల ఆస్తులపై హైకోర్టు జారీ చేసిన యథాతథస్థితి (స్టేటస్ కో ఇన్ ల్ యాస్పెక్ట్స్) ఉత్తర్వులు ప్రస్తుతం అమల్లోనే ఉన్నాయి. ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో కూడా ఎంవోయూలో నేను భవిష్యత్తులో నీకు మేలు చేయాలన్న నా అభిమతాన్ని స్పష్టంగా పేర్కొన్నాను. ముందు చెప్పినట్లు ఇదంతా కూడా తోడబుట్టిన సోదరిగా నీ పట్ల నాకున్న అంతులేని ప్రేమ, ఆప్యాయతతో చేశాను. ఇదంతా కూడా నేను నా ఇష్టపూర్వకంగా చేశాను."


"వాస్తవానికి నా ఆస్తులను, వాటాలను ఇతరులెవ్వరికీ బదలాయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఆస్తులన్నీ కూడా నేను సొంతంగా సంపాదించుకున్నవి కావున. నీ పట్ల నేను ప్రేమను, ఆప్యాయతను చూపుతున్నప్పటికీ నువ్వు మాత్రం నా పట్ల ఎలాంటి కృతజ్ఞతను చూపలేదు. కనీసం నువ్వు నా శ్రేయస్సును కూడా ఆకాంక్షించడం లేదు. ఇటీవల కాలంలో నువ్వు నాపై చేపట్టిన పలు చర్యలు నా మనస్సును తీవ్రంగా గాయపరిచాయి. అలాగే నువ్వు బహిరంగంగా పలు అసత్య, తప్పుడు ఆరోపణలు చేశావు. నీ చర్యలన్నీ నాకు రాజకీయంగా వ్యతిరేకంగా ఉన్నాయి. అంతేకాక నీ అసత్యాలతో నువ్వు నా వ్యక్తిగత ప్రతిష్టను కూడా దెబ్బతీశావు. నువ్వు ఎంచుకున్న మార్గాన్ని నేను నీ వివేచన, విచక్షణకే వదిలేయదలచుకున్నా. మరోసారి చెబుతున్నా, నీ చర్యలు వ్యక్తిగతంగా నన్ను, నా మనస్సును తీవ్రంగా గాయపరిచాయి. అంతేకాక ఎల్లప్పుడూ నేను నీ పట్ల చూపుతూ వచ్చిన ప్రేమ, ఆప్యాయత, అభిమానాన్ని దెబ్బతినేలా చేశాయి."


"నీకు మంచి చేయాలన్న నా అభిమతానికి అనుగుణంగా నేను కొన్ని చర్యలు చేపట్టాను. దీని కోసం మన అమ్మను విశ్వాసంలోకి తీసుకుని, నేను కొన్ని షేర్లను అమ్మకు బహుమతిగా ఇచ్చాను. కోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయిన తరువాతనే ఈ షేర్ల బదలాయింపు, షేర్ల బదలాయింపు సర్టిఫికేట్ల జారీ, బదలాయింపు ఫారంలపై సంతకాలు వంటివి పూర్తవుతాయని స్పష్టంగా చెప్పాను. కానీ నా నమ్మకాన్ని, చేసుకున్న ఒప్పందాన్ని ఒమ్ము చేసి, వివిధ సమయాల్లో నీతో పంచుకున్న న్యాయ సలహాలకు విరుద్ధంగా వ్యవహరించావు. వాటా బదలాయింపు ఫారంలపై నేను సంతకం చేయనప్పటికీ, వాటా ధృవపత్రాలను నేను మీకు అందచేయనప్పటికీ నువ్వు వాటాల బదలాయింపు విషయంలో ముందుకెళ్లి ఆ మేర బదలాయింపును అమలు చేశావు. ఈ విషయంలో నువ్వు కోర్టు అనుమతి కూడా తీసుకోలేదు."


"ఇదంతా కూడా నాకు న్యాయపరమైన సమస్యలు సృష్టించాలన్న మోసపూరిత బుద్దితో ఇలా చేశావు. నువ్వు ఇన్ని చేసినప్పుడు, నాకు నీ పట్ల ప్రేమ ఆప్యాయత, అనురాగం, అభిమానం ఎలా ఉంటాయి. నేను మారిన పరిస్థితుల నేపథ్యంలో మన మధ్య సత్సంబంధాలు లేవన్నది రహస్యమేమీ కాదు. ఎంవోయూ ద్వారా వ్యక్తం చేసిన నా అసలు అభిమతాన్ని అమలు చేసే ఉద్దేశం ఏదీ నాకు లేదని నీకు లాంఛనప్రాయంగా తెలియచేస్తూ ఆ విషయాన్ని నీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇకపై నేను ఎంవోయూలో వ్యక్తం చేసినా నా అభిమతానికి ఎంత మాత్రం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో. ఇందుకు దారి తీసిన పరిస్థితులకు, కారణాలకు నువ్వే బాధ్యురాలివి.."


" నా ఆస్తులను నీకు పంచాలన్న నా అసలు అభిమతాన్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వెనక్కి తీసుకుంటున్నా. నేను నమ్మి గిఫ్టేడ్ ద్వారా ఇచ్చిన సరస్వతి పవర్లోని వాటాలను మోసపూరితంగా నీవు బదలాయించావు. అసలైన యజమానిగా నేను కొనసాగుతున్నా, మోసపూరితంగా బదలాయించిన ఆ వాటా నాకు వెనక్కి బదలాయించాలి. నువ్వు నా పట్ల ఎన్ని రకాలుగా అనుచితంగా ప్రవర్తించినప్పటికీ అంతకు ముందులాగే మన ఉత్తర ప్రత్యుత్తరాలను గోప్యంగా ఉంచుతావని భావిస్తున్నా. ఆ నమ్మకంతోనే నేను నీకు ఈ లేఖ రాస్తున్నా."


"చివరిగా, మనిద్దరి మధ్య జన్మతః రక్త సంబంధం ఉంది. మన బాల్యానికి సంబంధించి ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి. నీ తీరు, ప్రవర్తన సానుకూలంగా ఉంటే నీ పట్ల నాకున్న అవ్యాజ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం నువ్వు తిరిగి పొందుతావు. అప్పుడు కోర్టు కేసులన్నీ పరిష్కారం అయిన తరువాత నీకు నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంతమేర చేయాలన్న విషయాలను పరిశీలిస్తా." అంటూ జగన్ మోహన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com