ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాదయాత్రలో అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి.. బీజేపీ పనేనా..?

national |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 11:01 PM

బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి కొందరు యత్నించినట్లు.. ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు దుండగులు కేజ్రీవాల్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సహా మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈడీ, సీబీఐ, తీహార్ జైలులను ఉపయోగించుకుని.. కేజ్రీవాల్‌ను, ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేయాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ప్రత్యక్షంగా దాడికి దిగిందని మండిపడ్డారు.


ఢిల్లీలోని వికాస్‌పురిలో అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తుండగా.. కొందరు ఆయన దగ్గరికి వచ్చారని.. దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడే ఉన్న పోలీసులు.. వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని సంచలన ఆరోపణలకు తెర తీశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆప్ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. కేజ్రీవాల్‎పై జరిగిన దాడి ఘటనపై ఢిల్లీ సీఎం ఆతిశీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ రాజకీయాలు ఎంత నీచానికి దిగజారిపోతాయో ఈ ఘటనతో ఢిల్లీ ప్రజలు చూశారని మీడియాకు వివరించారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించలేమని బీజేపీకి తెలుసని.. అందుకే పాదయాత్ర చేస్తున్న కేజ్రీవాల్‌పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను చంపాలని బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఇలాంటి దాడులకు ఆప్ నేతలు భయపడబోరని స్పష్టం చేశారు.


ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. ఈడీ, సీబీఐ, తీహార్ జైలుతో అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆప్‌ను అణిచివేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేపీ గూండాలు ఆయనపై దాడికి యత్నించారని ఆరోపించారు. కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే దానికి బీజేపీనే నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని సౌరభ్ భరద్వాజ్ హెచ్చరించారు. దాడి సమయంలో అక్కడే ఉన్న ఢిల్లీ పోలీసులు ఏం చేయకుండా బీజేపీ గుండాలతో కలిసి పోయారని విమర్శించారు. ఇక ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. ట్విటర్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీకి.. అరవింద్ కేజ్రీవాల్ శత్రువుగా మారారని పేర్కొన్నారు. మొదట ఈడీ, సీబీఐని ఉపయోగించి తప్పుడు కేసులు పెట్టి.. కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారని తెలిపారు.


తీహార్ జైలులో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వకుండా ఆపేసి.. ఆయను చంపడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. అది ఫలించకపోవడంతో ఇప్పుడు బీజేపీ గూండాలు అరవింద్ కేజ్రీవాల్‌పై నేరుగా దాడి చేశారని.. కేజ్రీవాల్‌ను చంపేయాలని బీజేపీ భావిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కి ఏం జరిగినా దానికి బీజేపీదే బాధ్యత అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com