ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పై మరోసారి మండిపడ్డ షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:17 PM

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీనీ వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అయ్యాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(సోమవారం) విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ అధినేత జగన్‌పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని మోదీ వారసుడు జగన్ తిరిగారని ఆరోపించారు.


అలాంటి వాళ్లకు వైఎస్సార్ ఆశయాలు గుర్తుకు ఉంటాయని అనుకోవడం, ఆశయాలకు వారసులు అవుతారనడం పొరపాటేనని విమర్శించారు. వైఎస్సార్ మానస పుత్రిక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అని గుర్తుచేశారు. నాడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైఎస్సార్ అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకైన జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరు గార్చారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు అని షర్మిల అన్నారు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని చెప్పారు. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద వైసీపీ ప్రభుత్వం పెట్టలేదని విమర్శించారు. నాడు జగన్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేయాలని చూస్తే.. నేడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్ షర్మిల ఆరోపించారు. వైసీపీ చేసింది మహా పాపమైతే.. కూటమి సర్కారు విద్యార్థులకు పెడుతున్నది శాపమని విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. బకాయిలు ఎవరు పెండింగ్‌లో పెట్టినా.. అవి విడుదల చేసే బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఉందని తెలిపారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, పథకానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని షర్మిల డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com