రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆక్షేపించారు. ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రజలు అధికారం ఇచ్చారనే తీరుతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఉందని ఆయన తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంటే.. ప్రజలకు భరోసా కల్పించాల్సిన సీఎం చంద్రబాబు కనీసం పరిస్థితిని సమీక్షించడం లేదని విమర్శించారు.
సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్బాబు మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్న మాజీ ఎమ్మెల్యే.. అరాచకాలను సీఎం చంద్రబాబు అదుపు చేయడం లేదని, మహిళలపై దాడులను అస్సలు పట్టించుకోవడం లేదని, ఇప్పుడు దిశ యాప్ ఉండి ఉంటే, ఇన్ని ఘటనలు జరిగేవి కావని స్పష్టం చేశారు. రాజకీయంగా కక్ష సాధింపునకు, తప్పుడు కేసుల నమోదుకు పోలీసులను వాడుకుంటున్నారని, తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించి, వాటితో వైయస్ఆర్సీపీ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు.