తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వైభవంగా నాంది పలికారు. తొలిరోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి పెద్దశేష వాహనంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు ఆలయంలో నిత్యపూజాదికాల అనంతరం ప్రధాన అర్చకులు వరుసగా శ్రీదేవి, భూదేవి, మలయప్ప, ఇతర దేవతలు, కంకణ భట్టాచార్యులైన గోవిందాచార్యులు, టీటీడీ ఈవో శ్యామలరావుకు కంకణ ధారణ చేశారు. మధ్యాహ్నం 3గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని బంగారు తిరుచ్చిలో మాడవీధుల్లో ఊరేగించారు. ధ్వజపటాన్ని కూడా ఊరేగిస్తూ బ్రహ్మోత్సవాలకు దేవతలందరికీ ఆహ్వానం పలికారు. సాయంత్రం 5.45- 6గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.