చిత్తూరులో అన్న క్యాంటీన్ అందుబాటులోకి వచ్చింది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయం పక్కన అన్న క్యాంటీన్ సోమవారం పునఃప్రారంభమైంది. రాష్ట్రంలోనే ఇక్కడ తొలుత ప్రారంభించారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అన్న క్యాంటీన్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. రూ.5 కే ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించారు. అతి తక్కువతో కడుపు నింపే ఈ క్యాంటీన్లు పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్న క్యాంటీన్లను మూసేసింది. పేదల కడుపు కొట్టింది. తిరిగి తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లే.. సీఎం కాగా చేసిన ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల ప్రారంభం కూడా ఉంది. ఆ వెంటనే అధికారులు గతంలోని భవనాలను శుభ్రం చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరులో అన్న క్యాంటీన్ను సోమవారం ఎమ్మెల్యే గురజాల జగన్మోన్, జేసీ శ్రీనివాసులుతో కలిసి కలెక్టర్ షన్మోహన్ ప్రారంభించారు. నగరంలోని దినసరి కూలీలు, కార్మికులకు అనుగుణంగా టిఫిన్, మధ్యాహ్న భోజనాన్ని రూ. 5కే వడ్డించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరులో ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. రానున్న రోజుల్లో నగరంలో అవసరమైన చోట్ల ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.