మేనల్లుడి చేతిలో మేనమామ హతమయ్యాడు. నాపరాయితో కొట్టి హతమార్చిన ఘటన పిఠాపురం మండలం భోగాపురంలో సంచలనం కలిగించింది. గ్రామానికి చెందిన బ్రహ్మదేవపు వరప్రసాద్(44), నాగులాపల్లి పద్మరాజులు వరుసకు మేనమామ, మేనల్లుడు. వీరిద్దరు తాపీ పనికి వెళుతూ తమ కుటుంబాలను పోషించుకుంటారు. వీరి కుటుంబాల మధ్య కొంతకాలంగా కలహాలు ఉన్నాయి. గురువారం రాత్రి పనికి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య కూలీ డబ్బుల విషయంలో ఘర్షణ జరిగింది. అనంతరం ఎవరికి వారు వెళ్లిపోయారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో గుడిలో నిద్రిస్తున్న వరప్రసాద్ను పద్మరాజు నాపరాయితో కొట్టి హత్య చేశాడు. దీంతో రక్తపు మడుగులో పడి వరప్రసాద్ అక్కడిక్కడే మరణించాడు. పద్మరాజు పరారయ్యాడు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ గుణశేఖర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వరప్రసాద్ సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.