కంపెనీల సమస్యలు తీరిస్తే ఏపీకి భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 2014నుంచి 2019వరకు, 2019 నుంచి 2024 వరకు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్న వారు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా చేయడమే తన మెుదటి కర్తవ్యం అని తెలిపారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.."రాష్ట్రాలు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం సహజం, కానీ సబ్సీడీలు ఎవరు ఫర్ఫెక్ట్గా ఇస్తున్నారనేదే ముఖ్యం. పారిశ్రామికవేత్తగా నాకు అనుభవం ఉంది. సబ్సీడీలపై వారికి నమ్మకం కలిగించాలి. ఆ పని టీడీపీ ప్రభుత్వం చేస్తుంది. సబ్సీడీలు ఇవ్వడం వల్లనే అమర్ రాజా కంపెనీ తెలంగాణకు వెళ్లిపోయింది. పరిశ్రమలకు అవసరమయ్యే ముడి సరకు ఏఏ ప్రాంతాల్లో ఉందో గుర్తిస్తాం. రా మెటీరియల్ సరఫరా, రోడ్లు, నీరు, ఇతర సదుపాయాలు కల్పిస్తే ఇండస్ట్రీయల్ జోన్ క్రియేట్ అయ్యి డెవలప్మెంట్ జరుగుతుంది. చంద్రబాబు గత ప్రభుత్వంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు జయరాత్ ఇస్పాత్ను తీసుకొచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో రాయితీల విషయంలో కంపెనీ అనేక సమస్యలు ఎదుర్కొంది. గుజరాత్ మాదిరిగా ఏపీలో కంపెనీలు పెట్టేందుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. ఇక జిల్లా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధిలో వారికి సహాయం చేస్తాను" అని చెప్పారు.