ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్ధరాత్రి హైవేపై గ్యాంగ్ వార్.. కర్రలతో కొట్టుకుని, కార్లతో ఫైటింగ్.. వీడియో వైరల్

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 10:46 PM

కర్ణాటకలో కొందరు యువకులు అర్ధరాత్రి పూట సృష్టించిన వీరంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు గ్రూప్‌లకు చెందిన యువకులు.. హైవేపై కార్లు, కర్రలతో రణరంగాన్ని తలపించారు. కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టుకోవడం.. అందులో ఉన్న కొందరు యువకులు బయటికి వచ్చి కర్రలతో ప్రత్యర్థులపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది. ఆ యువకులు చేసిన స్టంట్లు.. ఆ హైవే పక్కనే ఉన్న ఓ బిల్డింగ్‌పై నుంచి స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అందులోని కొందరు యువకులను అరెస్ట్ చేశారు.


కర్ణాటకలోని ఉడుపిలో ఉడుపి - మణిపాల్ హైవేపై ఈ నెల 18 వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆరుగురు యువకులు.. రెండు కార్లలో వచ్చి నడి రోడ్డుపై తీవ్ర ఘర్షణకు తెర తీశారు. కార్లతో పరస్పరం ఢీకొట్టుకున్నారు. అనంతరం అందులో నుంచి కొందరు దిగి కర్రలతో దాడి చేసుకున్నారు. ఇక రెండు కార్లు ఆ హైవేపై రయ్ మని దూసుకెళ్తూ ఢీకొట్టుకున్నాయి. అడ్డుగా ఉన్న వ్యక్తులను ఢీకొట్టి గాల్లోకి ఎగిరేశాయి. దీంతో ఆ వ్యక్తి కింద పడిపోగా.. అతని ప్రత్యర్థి వచ్చి కర్రతో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది.


ఈ సంఘటనను స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలను వదిలేయకూడదని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌ కావడంతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని.. మరో నలుగురి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అయితే ఆ రెండు గ్రూప్‌ల మధ్య డబ్బులకు సంబంధించి గొడవలు ఉన్నాయని.. వాటి కారణంగానే ఈ ఘర్షణ తలెత్తిందని పోలీసులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com