ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజ్రీవాల్ ట్వీట్‌కు పాక్ ఎంపీ కామెంట్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఢిల్లీ సీఎం

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 10:36 PM

భారత్‌లో జరిగే ప్రతీ విషయంపై పాక్ కన్నేసి ఉంచుతుంది. ఇక అనవసరంగా మన విషయాల్లో జోక్యం చేసుకుని.. తీవ్ర విమర్శల పాలు కావడం దాయాది దేశానికి అలవాటుగా మారింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని.. ఏదో ఒక మాట అనడం.. ఆ మాటకు.. భారత్ నుంచి కౌంటర్ ఎదుర్కోవడం పాకిస్థాన్‌కు షరామామూలే. ఈ క్రమంలోనే తాజాగా మన దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పాకిస్థాన్‌కు చెందిన ఓ ఎంపీ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. కేజ్రీవాల్ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పాక్ ఎంపీ ఫవాద్ చౌదరీ.. చేసిన ట్వీట్‌ అతడ్ని విమర్శల పాలు చేస్తోంది. ఈ ఘటనపై ట్విటర్‌లోనే స్పందించిన కేజ్రీవాల్.. ఫవాద్ చౌదరీకి ఘాటుగా బదులు ఇచ్చారు.


లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే చేతి వేలికి ఉన్న సిరా గుర్తును చూపిస్తూ దిగిన ఫోటోను కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాను తన తండ్రి, భార్య, పిల్లలతో కలిసి వెళ్లి ఓటు వేసినట్లు చెప్పారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని.. ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు. ఇక నియంతృత్వం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా తాను ఓటు వేసినట్లు చెప్పారు. ప్రజలంతా ఓటు వేసేందుకు వెళ్లాలని కేజ్రీవాల్ సూచించారు.


అయితే ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన పాక్ ఎంపీ ఫవాద్ చౌదరీ.. భారత ఎన్నికలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని ఫవాద్ హుస్సేన్ కామెంట్ పెట్టారు. అంతేకాకుండా ఆ ట్వీట్‌కు ఇండియా ఎలక్షన్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌‌ను కూడా జోడించారు. అయితే ఈ ట్వీట్‌పై అరవింద్ కేజ్రీవాల్ తన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. "మా దేశ వ్యవహారాల్లో తల దూర్చకుండా.. మీ దేశం సంగతి మీరు చూసుకోండి" అంటూ ఘాటుగా బదులిచ్చారు. ఇప్పుడు పాకిస్థాన్ మద్దతు ఏం అవసరం లేదంటూ కేజ్రీవాల్ హితవు పలికారు.


భారతదేశ సమస్యలను తాను, భారతదేశ ప్రజలు పరిష్కరించుకోగలరని చురకలు అంటించారు. ఈ విషయంలో పాక్ సలహాలు ఏమీ తమకు అక్కర్లేదంటూ పేర్కొన్నారు. అసలే పాకిస్థాన్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.. ముందు మీరు ఆ సంగతి చూడండని హేళన చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు భారత అంతర్గత వ్యవహారం అని.. ప్రపంచ దేశాలపైకి ఉగ్రవాదాన్ని పంపించే పాకిస్థాన్ లాంటి జోక్యాన్ని భారత్ ఏమాత్రం సహించదంటూ అరవింద్‌ కేజ్రీవాల్ పోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com