ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరేంద్ర మోదీపై ప్రకాష్ రాజ్ ట్వీట్.. రూ.80 లక్షల హోటల్‌ బిల్లు చెల్లించకపోవడంపై ప్రశ్నలు

national |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 10:35 PM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తరచూ విమర్శలు గుప్పించే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. మరోసారి ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తాజాగా ప్రధాని మోదీకి సంబంధించిన ఓ హోటల్ బిల్లు ఏకంగా రూ.80 లక్షలకు పైగా ఉన్నా.. దాన్ని చెల్లించకపోవడంతో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. సదరు హోటల్ కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందని వచ్చిన ఓ న్యూస్ పేపర్ వార్తను పోస్ట్ చేసిన ప్రకాష్ రాజ్.. దీనిపై ప్రధాని మోదీకి ప్రశ్నల వర్షం కురిపించారు.


గతేడాది ఓ కార్యక్రమం సందర్భంగా కర్ణాటకలోని మైసూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. 2023 ఏప్రిల్ 9 వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు జరిగిన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిర్వహించిన 50 ఏళ్ల ప్రాజెక్ట్ టైగర్ ఈవెంట్‌ను ప్రారంభించేందుకు మోదీ వెళ్లారు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న రాడిసన్ బ్లూ ప్లాజా ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్ బిల్లు ఏకంగా రూ.80.6 లక్షలు అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ హోటల్ బిల్లు.. అధికారులు చెల్లించలేదు. ఈ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం పేర్కొంది.


ఈ ఈవెంట్‌ కోసం ముందుగా అనుకున్న ఖర్చు రూ.3 కోట్లు కాగా.. పూర్తయ్యే సరికి అది రెట్టింపు అయింది. ఆ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేవలం రూ.3 కోట్లు మాత్రమే నిధులు విడుదల కాగా.. మరో రూ.3.3 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో హోటల్ బిల్లు కూడా చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బసవరాజుకు.. రాడిసన్ బ్లూ హోటల్ యాజమాన్యం ఎన్నిసార్లు లేఖలు రాసినా.. ఫలితం మాత్రం కనిపించలేదు. ఇక ఇది జరిగి ఏడాది దాటిపోగా.. సదరు హోటల్ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది.


2024 జూన్ 1 వ తేదీలోగా రూ.80.6 లక్షల హోటల్ బిల్లు కట్టాలని సదరు అధికారులకు మే 21 వతేదీన నోటీసులు పంపారు. లేకపోతే కోర్టుకు వెళ్లి చట్టపరంగా చూసుకుంటామని ఆ లేఖలో తెలిపారు. ఇక ఈ విషయం ఓ న్యూస్ పేపర్‌లో రాగా.. దానిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆ వార్తకు సంబంధించిన క్లిప్పింగ్‌ను ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. పరోక్షంగా నరేంద్ర మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడు పంపిన నాన్ బయోలాజికల్ జీవి నుంచి బిల్లును మానవులు ఎలా క్లెయిమ్ చేస్తారంటూ ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com