ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త అంత్యక్రియలపై భార్యల మధ్య గొడవ.. మద్రాస్ హైకోర్టు వినూత్న పరిష్కారం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 10:15 PM

గుండెపోటుతో చనిపోయిన తమ భర్తకు అంత్యక్రియలు నిర్వహించే విషయంలో అతడి ఇద్దరు భార్యలు ఘర్షణపడ్డారు. వేర్వేరు మతాలకు చెందిన ఆ ఇరువురూ తమ మతం ప్రకారమే జరపాలంటూ పట్టుపట్టారు. చివరకు వ్యవహారం కోర్టుకు చేరడంతో వినూత్న పరిష్కారం చూపింది. హిందూ సంప్రదాయ ప్రకారం పూజలు నిర్వహించి, ముస్లిం మత ఆచారాలను అనుసరించిన ఖననం చేయాలని సూచించింది. అంత్యక్రియల్లో ఇరు మతాలను సంప్రదాయాలను అనుసరించాలని స్పష్టం చేసింది. విచిత్రమైన ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కరైకుడి బర్మాకాలనీ వళ్లువర్‌ నగర్‌కు చెందిన బాలసుబ్రమణ్యన్‌ అలియాస్‌ అన్వర్‌ హుస్సేన్‌ (59) రవాణా శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన 36 ఏళ్ల కిందట శాంతి అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె ఉంది. అయితే, పెళ్లి తర్వాత కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో శాంతి నుంచి విడిపోయిన బాలసుబ్రమణ్యన్‌.. ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.


తిరుపాలకుడి ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అలిఫాతిమా అనే మహిళను 28 ఏళ్ల కిందట వివాహం చేసుకోగా.. ఆ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. కాలక్రమంలో తానూ ముస్లిం మతాన్ని స్వీకరించి అన్వర్‌ హుస్సేన్‌గా పేరు మార్చుకున్నారు బాలసుబ్రమణ్యన్. కాగా, కొద్ది రోజుల కిందట గుండెపోటుకు గురైన ఆయన.. చికిత్స కోసం మదురైలోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ అన్వర్‌ హుస్సేన్‌ రెండు రోజుల కిందట మృతిచెందాడు. దీంతో ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించేందుకు రెండో భార్య ఫాతిమా ఏర్పాట్లు చేసింది.


భర్త మరణవార్త తెలిసి అక్కడకు వచ్చిన మొదటి భార్య శాంతి.. తమ స్వగ్రామంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామని పట్టుబట్టింది. ఇరువురూ ఈ విషయంలో ఘర్షణకు దిగడంతో వివాదం పోలీస్ స్టేషన్‌ చేరింది. ఇరువర్గాలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో న్యాయస్థానంలో తేల్చుకోవాలంటూ.. మృతదేహాన్ని కారైకుడి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.


భార్యలిద్దరూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ స్వామినాధన్‌.. అన్వర్‌ హుస్సేన్‌ భౌతికకాయానికి హిందూ మతం ప్రకారం సంప్రదాయ పూజలు నిర్వహించి, ముస్లిం మతం ప్రకారం ఖననం చేయాలని సూచించారు. దీంతో వివాదం సమసిపోయింది. కోర్టు చెప్పినట్టే బాలసుబ్రమణ్యన్ అలియాస్ అన్వర్ హుస్సేన్‌కు మొదటి భార్య హిందూ మతం ప్రకారం పూజలు చేయగా... రెండో భార్య సమాధి చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com