ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 9 తర్వాత ఏ రోజైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 10:16 PM

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ దాదాపు కసరత్తు పూర్తిచేసినట్టు సమాచారం. దేశంలోని సార్వత్రిక, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ఏర్పాట్లను సమీక్షిస్తోన్న విషయం తెలిసిందే. వివిధ రాజకీయ పక్షాలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూ కశ్మీర్‌‌లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇందుకోసం మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాల మోహరింపుపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఆ తర్వాత మార్చి 12-13 తేదీల్లో ఈసీ బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశీలించనుందని తెలిపాయి.


పార్లమెంట్‌తో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మార్చి రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు భోగట్టా. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ.. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఈసారి కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ దఫా కూడా ఏడు దశల్లోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది.


బీహార్‌లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం సోమవారం అక్కడకు చేరుకుంది. సీఈసీతో పాటు, ఎన్నికల కమిషనర్లు అరుణ్ గోయల్, ధర్మేంద్ర శర్మ, ఇతర సీనియర్ అధికారులు కూడా రాష్ట్రానికి చేరుకున్నారని, రాబోయే రెండు రోజులు ఇక్కడే ఉంటారని అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, షెడ్యూల్ వచ్చేలోగా పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పూర్తిచేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. అటు, ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com