ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ రైతుల ఆందోళనలు.. పోలీసుల టియర్ గ్యాస్‌కు కౌంటర్‌గా ఇనుప కవచాలు, జూట్ బ్యాగులు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 10:14 PM

కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో అన్నదాతలు మళ్లీ తమ ఢిల్లీ ఛలో మెగా మార్చ్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి మళ్లీ దేశ రాజధాని ఢిల్లీకి యాత్ర చేపట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే అటు.. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఢిల్లీలోకి అనుమతించకపోవడంతో అన్నదాతలు తమదైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైతులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను సెక్యూరిటీ సిబ్బంది ప్రయోగిస్తుండగా.. వాటికి కౌంటర్‌గా తాము కూడా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న రైతులు.. వాటికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇనుప కవచాలు, జూట్ బ్యాగులతో మలి విడత ఆందోళనలకు సిద్ధం అయ్యారు.


పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం సహా వివిధ రకాల డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. వివిధ రాష్ట్రాల్లోని అన్నదాతలు ఈ నెల 13 వ తేదీన దేశ రాజధాని ఢిల్లీకి మెగా మార్చ్ ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రైతులను.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల వద్దే నిలిపివేసింది. వారిపై టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించడంతో రైతులు అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రుల బృందంతో రైతు సంఘాల నేతలు నిర్వహించిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో తిరిగి తమ ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించారు.


అయితే పప్పులు, మొక్కజొన్న, పత్తి వంటి మూడు పంటలకు సంబంధించి 5 ఏళ్లు పాత కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని రైతు సంఘాలు తిరస్కరించాయి. దీంతో బుధవారం నుంచి ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే ఈసారి మరింత పకడ్బందీగా యాత్ర చేపట్టి.. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలోకి చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇనుప షీల్డ్‌లు, జూట్ బస్తాలను సిద్ధం చేసుకున్నారు. పంజాబ్-హర్యానా బోర్డర్‌లోని శంభు సరిహద్దు వద్ద ఈ ఇనుప కవచాలు, జూట్ బ్యాగులను తరలించుకున్నారు. పోలీసులు వదిలే టియర్ గ్యాస్ షెల్స్ నుంచి తప్పించుకునేందుకు ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలోనే రైతుల ఆందోళనలు కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులకు పోలీసులు ఐడీ కార్డులు అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు.. జర్నలిస్ట్‌ల రూపంలో నిరసనల్లో పాల్గొనకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ వైపు శాంతియుత పద్దతుల్లో మెగా మార్చ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు రైతులు తెలిపారు. అయితే ఈ సమయంలోనే తమను అణిచివేసేందుకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. తాము నిరసనలను శాంతియుతంగా చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.


రెండు, మూడు పంటలకు మాత్రమే కనీస మద్దతు ధర వర్తింపజేసి.. మిగిలిన పంటలు పండించే రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పోవడం మంచిది కాదని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధానంపై తాము చాలా అధ్యయనం చేసి దాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు. సుమారు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఈ నెల 13 వ తేదీన ఢిల్లీకి పాదయాత్రను ప్రారంభించారు.


ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరల అస్థిరతల నుంచి రైతులను రక్షించేందుకు ఉద్దేశించి పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనేది ఆందోళన చేస్తున్న రైతుల ప్రధాన డిమాండ్. దీంతోపాటు రైతు రుణమాఫీ, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు.. రైతులు, రైతు కూలీలకు పెన్షన్‌, 2020 లో జరిగిన నిరసనలో పాల్గొన్న రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతులకు న్యాయం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com