కర్ణాటకలోని సుళ్యాడి గ్రామ మారెమ్మ దేవాలయంలో ఇటీవల విష ప్రసాదం పంపిణీ అయిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై కర్ణాటకలోని ఆలయాల్లో అన్నదానాలు, ప్రసాద వితరణ చేసేముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా అన్నప్రసాదాలు తయారుచేసే గదుల్లో నిఘా కెమేరాల ఏర్పాటు చేయాలని సూచించింది. వంటగదుల్లోకి అపరిచితుల ప్రవేశం కూడదని పేర్కొంది. అలాగే ప్రసాదాలు తినేందుకు యోగ్యమైనవేనని తేల్చేందుకు ఆరోగ్యశాఖ అధికారులు, ఆహార నిపుణుల అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల మారెమ్మ ఆలయంలో పంపిణీ చేసిన ప్రసాదంలో క్రిమిసంహారక మందు అవశేషాలున్నట్లు రసాయన పరీక్షల్లో వెల్లడైంది. కాగా ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 14కు చేరింది. అలాగే ఈ ఘటనలో అనారోగ్యం పాలై వివిధ ఆసుపత్రుల్లో చేరిన 90 మందికిపైగా చికిత్స తీసుకుంటున్నారు.