శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ రివ్యూ పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఎదుట మొత్తం 49 పిటిషన్లు దాఖలయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఈ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే పాత తీర్పుపై స్టే ఇవ్వలేమని పేర్కొంది.
కేరళలోని పవిత్ర శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పు వెలువడిన నాటి నుంచి శబరిమలలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. తీర్పునకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. కాగా.. మాస పూజల నిమిత్తం అక్టోబరు 17న ఆలయాన్ని తెరవగా ఈ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కొందరు మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు ప్రయత్నించడంతో భక్తులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు సహా పలువురు రివ్యూ పిటిషన్ను దాఖలు చేశారు. వీటిని అంగీకరించిన న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది.