న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతదారు, కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ట్విట్టర్ వేదికగా బ్యాంకులను ప్రశ్నించారు. వన్ టైం సెటిల్మెంట్ల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులకు విధానాలున్నాయి. వందలాది మంది రుణగ్రహీతలు తమ సమస్యలను పరిష్కరించుకున్నారు. దీన్ని తనకెందుకు నిరాకరిస్తున్నారు? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు సమక్షంలో తామిచ్చిన విలువైన ఆఫర్ను బ్యాంకులు పరిశీలించకుండానే తిరస్కరించాయన్నారు. న్యాయమైన పరిష్కారం కోసం తాను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. ప్రతి కోర్టు ఆదేశాన్ని వినయంగా విధేయతతో అనుసరిస్తున్నానని చెప్పారు. న్యాయమైన విచారణ లేకుండా తనను దోషిని చేయడానికి ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. తనను దోషిని చేయడానికి తనపై అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆరోపణలే నిదర్శనమన్నారు విజయ్ మాల్యా.