ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతిపై వేటు...నిజాయితీకి చోటు...!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 12:04 PM

వ్యాపార మంత్రిగా పేరున్న వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కార్యాలయ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన ప్రతిష్ట మంటగలిసింది. స్వపక్షీయులే బాహాటంగా విమర్శలు కురిపించారు. దీంతో కళ్లు తెరిచిన 'పత్తిపాటి' అంతరంగిక సిబ్బంది...అధికారులను తప్పించి..నిజాయితీపరులైన ఇద్దరు అధికారులను తన కార్యాలయంలో నియమించుకున్నారు. వీరిలో ఒకరు 'వెంకట్రామయ్య'. నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది. 'పుల్లారావు' కార్యాలయంలో పనిచేయాలని ఆయనను సిఎంఒ కార్యాలయ అధికారి ఒకరు స్వయంగా పిలిపించి నచ్చచెప్పి ఒప్పించారు. కాగా మరో అధికారి 'కపర్తి' అనే మరో అధికారి కూడా నిజాయితీపరుడిగా పేరుంది. ఇంతకు ముందు పశుసంవర్ధకశాఖలో 'కపర్తి' పనిచేసేవారు. ఆయన నిజాయితీని తెలుసుకున్న మంత్రి పుల్లారావు తన కార్యాలయంలో నియమించుకున్నారు. అంతకు ముందు కార్యాలయంలో పనిచేసిన ఓఎస్‌డి, పిఎస్‌, పిఎలు ఒక్కో ఫైల్‌కు ఫిక్స్‌డ్‌ రేట్లను నిర్ణయించి వసూలు చేసేవారు. కేవలం సమాచారం కోసమే వేలాది రూపాయలను డిమాండ్‌ చేసేవారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రి కార్యాలయం అవినీతిలో నెంబర్‌వన్‌ కార్యాలయంగా మారిందనే విమర్శలు ఎదుర్కొంది. అంతే కాకుండా మంత్రి కుటుంబసభ్యుల్లో ఒకరిని ఈ అవినీతి పరులు కాకా పట్టి వారి ఆశీస్సులతో లక్షలు వెనకేసుకున్నారు.
  ఈ విషయాలన్నీ బయటకు పొక్కడంతో కార్యాలయ అధికారులను, సిబ్బందిని తొలగించడమే కాకుండా కుటుంబసభ్యుల దూకుడును కూడా మంత్రి పుల్లారావు కట్టడి చేశారు. ఒకప్పుడు 'పుల్లారావు' కార్యాలయానికి వెళ్లాలంటే ముడుపులు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏ ఒక్క సమాచారం బయటకు పొక్కడం లేదు. అంతా గోప్యంగా జరుగుతుంది. ఏ ఫైల్‌ వస్తుందో...ఏ నిర్ణయం తీసుకుంటున్నా కూడా బయటకు తెలియనీయకుండా అంతరంగిక అధికారులు వెంకట్రామయ్య, కపర్తిలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో 'పుల్లారావు' కార్యాలయం మాత్రమే నిజాయితీగా పనిచేస్తుందని గతంలో విమర్శలు చేసిన వారు కూడా అంగీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా 'పుల్లారావు' అంతరంగిక అధికారుల పనితీరును కొనియాడుతూ ప్రశంసిస్తున్నారు. ఇదే పనిని రెండేళ్ల ముందు 'పుల్లారావు' చేసినట్లయితే అంత దారుణమైన విమర్శలు, ఆరోపణలు వచ్చేవి కావు. అంతరంగికులు చేసిన అవినీతి, అల్ల‌ర్ల‌కు మంత్రి పుల్లారావు బలయ్యారు..ఫలితం ముందు ముందు ఎలా ఉంటుందో...?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com