ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌వాసుల కిడ్నీలు దోచుకుంటున్న ముఠా.. 328 మంది నుంచి అవయవాలు మాయం

international |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 09:28 PM

పాక్‌లో భారీ కిడ్నీ రాకెట్ గుట్టు బయటపడింది. ఊరు పేరు లేని ఓ డాక్టర్ ముఠాను ఏర్పరిచి.. కిడ్నీలు తీసి అమ్ముకుంటున్న కొంతమందిని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. కొంతమంది వ్యక్తులు తనను బెదిరించి.. కిడ్నీ ఇవ్వాలని బెదిరించినట్లు ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. తీగ లాగితే డొంకంతా కదిలింది. ఈ ముఠా ఆగడాలు చూసి పోలీసులే విస్తుపోయారు. ఏకంగా 328 మంది నుంచి కిడ్నీలు తీసుకున్నట్లు గుర్తించారు. అయితే ఈ ఆపరేషన్లను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిర్వహించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు.. ఒక భారీ కిడ్నీ రాకెట్‌ ఆగడాలను బయటపెట్టారు. డబ్బులు ఉన్న వారికి కావాల్సిన కిడ్నీలను అందించేందుకు పేదలు, సామాన్యులను డబ్బుల ఆశ చూపించి, బెదిరించి బలవంతంగా ఆపరేషన్లు చేసి కిడ్నీలను తీసుకుంటున్న ఘటనలు వెలుగు చూశాయి. కిడ్నీ తీసుకునేందుకు ప్రయత్నించగా.. తప్పించుకున్న ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పంజాబ్ ప్రావిన్స్ పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మొహ్‌సిన్ నఖ్వీ వెల్లడించారు. ఫవాద్ అనే ఓ అనామక డాక్టర్ ఆధ్వర్యంలో ఈ కిడ్నీ రాకెట్ దందా సాగుతోందని పోలీసులు గుర్తించారు.


ఇప్పటివరకు డాక్టర్ ఫవాద్ మొత్తం 328 సర్జరీలు నిర్వహించినట్లు పంజాబ్ ప్రావిన్స్ సీఎం మొహ్‌సిన్ నఖ్వీ వెల్లడించారు. ఈ ఆపరేషన్ల ద్వారా సుమారుగా 35 వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.28.27 లక్షలు సంపాదించినట్లు గుర్తించారు. పేదలు, అమాయకులు, డబ్బులు అవసరం ఉన్నవారిని గుర్తించి.. వారికి నమ్మించి, బెదిరించి.. ఆపరేషన్లు చేసి వారి కిడ్నీలను తీసుకున్నట్లు తెలిపారు. ఈ కిడ్నీ రాకెట్ ముఠాలో ఇప్పటివరకు మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో ఉన్న ఓ కారు మెకానిక్ బాధితులకు మత్తు మందు ఇవ్వడంలో సహకరించేవాడని పోలీసులు వెల్లడించారు.


బాధితులను లాహోర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఆపరేషన్లు చేసేవారని తెలిపారు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కిడ్నీ మార్పిడులకు సంబంధించి ఎలాంటి చట్టాలు లేకపోవడంతో నిందితులు ఆ ప్రాంతాన్ని ఎంచుకుని బాధితులను అక్కడికి తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు సర్జరీలు నిర్వర్తించారని పేర్కొన్నారు. అయితే ఇలా ఆ ముఠా నిర్వహించిన ఆపరేషన్లు వికటించి ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.


అయితే ఇదే కిడ్నీ రాకెట్ కేసులో నిందితుడు డాక్టర్ ఫవాద్‌.. గతంలో 5 సార్లు అరెస్ట్ అయినట్లు గుర్తించారు. ఆ సమయంలో చట్టంలో ఉన్న లొసుగులతో సులువుగా బయటికి వచ్చినట్లు తెలిపారు. అయితే బాధితుల్లో కొంతమందికి సర్జరీలు చేసినా.. వారి కిడ్నీలు తీసినట్లు తెలియదని పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి ప్రైవేటు ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పాడు. అయితే తాను ప్రస్తుతం వేరే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేసుకుంటే తన శరీరంలో ఒక కిడ్నీ లేదని చెప్పారని తెలిపాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com