ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వాసుపత్రిలో ఒకేరోజు 24 మంది మృతి,,,,తీవ్ర రాజకీయ దుమారం రేపిన ఘటన

national |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 09:24 PM

మహారాష్ట్రలో మహా విషాదం నెలకొంది. ప్రభుత్వాసుపత్రిలో ఒకేరోజు 24 మంది చనిపోవడం తీవ్ర సంచలనంగా మారింది. చనిపోయిన వారిలో 12 మంది అదే రోజు పుట్టిన నవజాత శిశువులు ఉండటం హృదయాలను కలిచివేస్తోంది. అయితే ఆస్పత్రిలో మందులు లేకపోవడం, సరిపడినంత మంది సిబ్బంది లేకపోవడమే ఇంతటి దుర్ఘటనకు కారణమని అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


నాందేడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ మహా విషాదం చోటు చేసుకుంది. మందులు, వైద్య సిబ్బంది కొరత కారణంగా 24 గంటల వ్యవధిలోనే 24 మంది మృతి చెందడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ 24 మందిలో 12 మంది అదే 24 గంటల వ్యవధిలో పుట్టిన వారు ఉండటం తీవ్ర సంచలనంగా మారింది. గడిచిన 24 గంటల వ్యవధిలో తమ ఆస్పత్రిలో 24 మంది మృతి చెందినట్లు నాందేడ్ ప్రభుత్వాసుపత్రి డీన్ శంకర్‌రావు చవాన్ స్పష్టం చేశారు. అయితే అందులో 12 మంది నవజాత శిశువులు ఉన్నారని.. వారిలో ఆరుగురు మగ శిశువులు, మరో ఆరుగురు మగ శిశువులు ఉన్నట్లు వెల్లడించారు.


అయితే చనిపోయిన మరో 12 మంది రోగులు వివిధ వ్యాధులు సోకిన వారని డీన్ చెప్పారు. అందులో ముఖ్యంగా పాముకాటుకు గురైన వారు ఉన్నట్లు తెలిపారు. అయితే నాందేడ్ ఆస్పత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నట్టు వెల్లడించారు. నాందేడ్ ఆస్పత్రిలో నమోదైన ఈ మరణాలపై వైద్యుడు డా.శ్యామ్‌రావు వకోడే స్పందించారు. ఆస్పత్రిలో సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు వచ్చాయిని.. రోగుల కోసం కేటాయించిన బడ్జెట్‌ కూడా సర్దుబాటు కాలేదని పేర్కొన్నారు.


అయితే ఒకేరోజు ఒకే ఆస్పత్రిలో 24 మంది చనిపోవడం రాజకీయంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ అంశంపై మహారాష్ట్రలో ఉన్న విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. బీజేపీ, ఏక్‌నాథ్‌ శిందే- శివసేన, ఎన్సీపీ- అజిత్‌ వర్గం.. నేతృత్వంలోని ట్రిపుల్ ఇంజిన్ సర్కారే ఈ 24 మరణాలకు బాధ్యత వహించాలని మహా వికాస్ ఆఘాఢీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆస్పత్రిలో ఒకేరోజు 12మంది నవజాతా శిశువులతో పాటు 24 మంది మృతి చెందిన ఘటనను ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. ఈ మరణాలు సాధారణంగా జరిగినవి కావని.. వీటిపై సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.


అయితే గతంలో థానే పట్టణంలో చూపిన నిర్లక్ష్యం, అజాగ్రత్తే ఈసారి కూడా కనిపించిందని సుప్రియా సూలే విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు బాధ్యతగా సంబంధిత మంత్రులతో రాజీనామా చేయించాలని.. మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని సీఎం ఏక్‌నాథ్‌ శిండేను సుప్రియా సూలే కోరారు. మహారాష్ట్ర ప్రజల ప్రాణాలంటే అంత చులకననా అంటూ మండిపడ్డారు. ఆస్పత్రుల్లో తీవ్రంగా మందుల కొరత ఉందని.. సకాలంలో వైద్య సేవలు అందడం లేదని నాందేడ్ ఆస్పత్రిలో ఉన్న రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో విషాదం చోటుచేసుకుంది. ఠాణే ప్రభుత్వ ఆస్పత్రి దుర్ఘటన మరువక ముందే తాజాగా నాందేడ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది. ఒకేరోజు 24 మంది మృత్యువాతపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మృతుల్లో 12మంది నవజాత శిశువులు ఉండటం పెను విషాదం రేపుతోంది. ఆస్పత్రిలో ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com