ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ బహుమతి.. పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌పై పరిశోధనలకు పట్టం

international |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 09:29 PM

ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లో అధ్యయానికి ముగ్గుర్ని నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు. అమెరికాకు చెందిన పియర్ ఆగోస్టినీ, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌస్జ్, స్వీడన్‌కు చెందిన అన్నే లూ హుయిలర్‌లు.. ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లో కాంతి అటోసెకండ్ పల్స్‌ ఉత్పత్తిపై చేసిన కృషిగానూ ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ తెలిపింది. వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్ల ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని కితాబు ఇచ్చింది. ప్రైజ్ మనీని ముగ్గురి శాస్త్రవేత్తలకు సమానంగా పంపిణీ చేయనున్నారు.


‘వాయువు ద్వారా ఇన్‌ఫ్రారెడ్ లేజర్ కాంతిని ప్రసారం చేసినప్పుడు అనేక రకాల కాంతి ఉద్భవిస్తుందని లూ హుయిలర్ నిరూపించారు... ప్రతి ఓవర్‌టోన్ అనేది లేజర్ కాంతిలోని ప్రతి చక్రానికి ఇచ్చిన సంఖ్యలో చక్రాలతో కూడిన కాంతి తరంగం.. లేజర్ కాంతి వాయువులోని పరమాణువులతో సంకర్షణ చెందడం వల్ల ఇవి సంభవిస్తాయి.. ఇది కొన్ని ఎలక్ట్రాన్లకు అదనపు శక్తిని ఇస్తుంది.. అది కాంతి రూపంలో విడుదలవుతుందనే దృగ్విషయంపై లూ అన్వేషణ కొనసాగించారు’ అని నోబెల్ కమిటీ ప్రశంసించింది.


ఫ్రాన్స్‌లోని యాక్సి-మార్సైల్లే యూనివర్సిటీ నుంచి 1968లో పీహెచ్‌డీ పూర్తిచేసి.. పియరీ అగోస్టనీ కొలంబస్‌లోని ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌస్ట్.. ఆస్ట్రియాలోని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1991లో పీహెచ్‌డీ పూర్తిచేసి.. మ్యూనిచ్ యూనివర్సిటీ మాక్స్ ప్లాంక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.. 1958లో ఫ్రాన్స్‌లో జన్మించిన లూ హూయిలర్.. పారిస్‌లోని పియరే అండ్ మారీ క్యూరీ యూనివర్సిటీ నుంచి 1986లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ‌లో ప్రొఫెసర్‌గా ఎలక్ట్రాన్ డైనమిక్స్‌పై పరిశోధనలు కొనసాగించారు.


కాగా, ఈ ఏడాది మెడిసిన్‌లో నోబెల్ బహుమతికి ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వైద్యశాస్త్రంలో న్యూక్లియోసైడ్‌ బేస్‌ మోడిఫికేషన్లలో కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ చేసిన ఆవిష్కరణలకు అవార్డు వరించింది. వీరి ఆవిష్కరణ ప్రపంచాన్ని వణికిస్తోన్న కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు, ఈ ఏడాది నుంచి నోబెల్ ప్రైజ్ మనీని 10 లక్షల స్వీడిష్ క్రోనార్ల నుంచి 11 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ బహుమతులను 120 ఏళ్ల నుంచి అందజేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com