ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాక్‌పై 15 అడుగుల మేర రాళ్లు, ఇనుప రాడ్లు,,,,,వందేభారత్ రైలు వెళ్లే మార్గంలో దుండుగులు కుట్ర

national |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 09:23 PM

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌ రైలుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు వెళ్లే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు చిన్న చిన్న రాళ్లు, ఇనుప రాడ్లను వరుసగా పేర్చారు. అయితే, దూరం నుంచే వాటిని గమనించి లోకోపైలట్లు.. వెంటనే రైలును నిలిపివేశారు. అనంతరం వాటిని రైల్వే సిబ్బంది తొలగిస్తుండగా.. పట్టాలను కలిపే లింక్ వద్ద రెండు ఇనుప రాడ్లను దుండుగులు అమర్చిన విషయం గుర్తించారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా సమీపంలో సోమవారం చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన 30 సెకెన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఉదయ్‌పూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ సోమవారం ఉదయం ఉదయ్‌పూర్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఈ మార్గంలో భిల్వారా సమీపంలో రైల్వే ట్రాక్‌పై దుండుగులు దాదాపు 15 అడుగుల మేర రాళ్లు, ఇనుప రాడ్లను అమర్చారు. దూరం నుంచే వీటిని గుర్తించిన లోకో పైలట్లు.. అప్రమత్తమై అత్యవసర బ్రేకులు సాయంతో రైలును నిలిపివేశారు. అనంతరం ట్రాక్ పై ఉన్న రాళ్లు, ఇనుప రాడ్లను రైల్వే సిబ్బంది తొలగించారు. ఈ క్రమంలో మరో షాకింగ్ విషయాన్ని వారు గుర్తించారు. పట్టాలను అనుసంధానం చేసే ప్రదేశం వద్ద రెండు ఇనుప రాడ్లను నిలువుగా దూర్చిన విషయం బయటపడింది.


పట్టాలపై రాళ్లు కింద పడకుండా ఉండేందుకు.. అటు, ఇటు రెండు రాడ్లను అమర్చారని రైల్వే సిబ్బంది నిర్ధారించారు. ఒకవేళ వీటిని గమనించకుండా రైలు వేగంగా వెళ్లి ఉంటే.. పెను ప్రమాదమే జరిగేదని, బాలాసోర్ వంటి దుర్ఘటనగా నిలిచిపోయేదని అధికారులు భావిస్తున్నారు. ఈ తతంగం మొత్తాన్ని రైల్వే సిబ్బంది ఫోన్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఉదయపూర్- జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సెప్టెంబర్ 24నే ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.


ఈ ఘటనపై వాయువ్య రైల్వే ట్విట్టర్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ఈరోజు జైపూర్ నుంచి ఉదయ్‌పూర్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గ్యాంగ్రార్, సోనియానా స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై రాళ్లు, ఇనుప రాడ్లు వేసి పట్టాలను తప్పించేందుకు సంఘ వ్యతిరేకులు ప్రయత్నించారు. అసాంఘిక శక్తులపై రైల్వే యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటోంది.. దోషులను విడిచిపెట్టేది లేదు’ అని పేర్కొంది.


రైలు మార్గంలో ఆటంకం కలిగించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారని, వారిపై చిత్తోర్‌గఢ్ జిల్లా గ్యాంగ్రార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యిందని వాయువ్య రైల్వే అధికారులు తెలిపారు. ‘వాయువ్య రైల్వే జోన్ అజ్మేర్ డివిజన్ పరిధిలోని గ్యాంగ్రార్, సోనియానా స్టేషన్ల మధ్య ట్రాక్‌పై రాళ్లు, కడ్డీలు, రెండు అడుగుల ఇనుప రాడ్లను గుర్తుతెలియని వ్యక్తులు ఉంచినట్టు ఉదయ్‌పూర్-జైపూర్ వందేభారత్ రైలు లోకో పైలట్ సమాచారం ఇచ్చారు.. తక్షణమే ఆయన అప్రమత్తమై రైలు నిలిపివేసి పట్టాలపై రాళ్లు, ఇనుప కడ్డీలు తొలిగించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ’ అని వాయువ్య రైల్వే చీఫ్ పీఆర్వో శశి కిరణ్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com