ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత దౌత్యవేత్తను బహిష్కరించిన కెనడా

national |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:14 PM

ఖలిస్థాన్ మద్దతుదారు, భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్‌లో కెనడాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు భారత ప్రభుత్వంతో సంబంధం ఉందని తమ దగ్గర విశ్వసనీయమైన సమాచారం ఉందంటూ.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంట్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. కెనడా పౌరుడైన నిజ్జర్‌ను కెనడాలోనే హత్య చేయడాన్ని తమ సార్వభౌమత్వంపై జరిగిన దాడిగా ట్రూడో అభివర్ణించారు. దీన్ని ఏమాత్రం ఉపేక్షించలేమన్నారు. అంతటితో ఆగకుండా.. కెనడాలో ‘రా’ హెడ్ అనే ఆరోపణలతో భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్‌ను కెనడా బహిష్కరించింది. కెనడా ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. ఈ ఘటన నేపథ్యంలో భారత్, కెనడా మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా దిగజారాయని భావించొచ్చు.


మొదటి నుంచి కెనడా ఖలిస్థాన్ వేర్పాటువాదులకు అడ్డాగా మారింది. ట్రూడో అధికారంలోకి వచ్చాక ఇది మరీ ఎక్కువైంది. ఖలిస్థాన్ మద్దతుదారులకు అండగా ఉండొద్దంటూ భారత ప్రభుత్వం పదే పదే కోరినా.. కెనడా ప్రధాని పట్టించుకోవడం లేదు. తాజాగా కెనడా మరింత తెంపరితనంతో భారత దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఇలా చేయొచ్చంటూ.. రిటైర్డ్ మేజర్ గౌరవ్ ఆర్య ట్వీట్ చేశారు.  భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించిందనే వార్తపై గౌరవ్ ఆర్య స్పందిస్తూ.. ఇది ఎక్సలెంట్ న్యూ్స్ అంటూ ట్వీట్ చేశారు. భారత్ దీనికి దీటుగా బదులిస్తుందన్న ఆయన.. ఇప్పటి దాకా దౌత్య సంబంధాలు భారత్‌ను అడ్డుకున్నాయని.. త్వరలోనే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోతాయని ఆయన అంచనా వేశారు. భారత్‌లోని కెనడా హైకమిషన్‌ను మూసివేసే టైం వచ్చిందంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. గెంటేయక ముందే మీరు దుకాణం బంద్ చేసి బయల్దేరడం మంచిదంటూ భారత్‌లోని కెనడా రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాగ్ చేశారు.


‘ఇకపై కెనడా స్పందనతో నిమిత్తం లేకుండా.. ఖలిస్థాన్ ఉగ్రవాదులను బ్లాక్ చేయడం కుదురుతుంది. వాళ్ల (ఖలిస్థాన్ ఉగ్రవాదుల) ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు భారత్‌లో ఉన్నాయి. కెనడా నుంచి డబ్బులు పొందే వారి బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక నుంచి ప్రతీది ఎన్ఐఏ స్కానర్ పరిధిలోకి వస్తుంది. కెనడాతో దౌత్య సంబంధాలను త్వరగా తెంచుకోవాలి. అలా చేస్తేనే ఖలిస్థాన్ ఉగ్రవాదంపై పోరాడగలం. ఖలిస్థాన్ మద్దతుదారులు, సానుభూతిపరులెవరూ భారత్ నుంచి కెనడా వెళ్లడానికి వీల్లేదు. అలాగే కెనడా నుంచి భారత్ వచ్చేందుకు అవకాశం ఉండొద్దు. ఖలిస్థానీలను భారత్‌కు అప్పగిస్తున్నందుకు ట్రూడోకు ధన్యవాదాలు. మీ ఇగో మేలు చేసింది. మీకెంతో ఇష్టమైన ఖలిస్థానీలపై మీరే మెరుపుదాడి చేశారు’ అంటూ మేజర్ గౌరవ్ ఆర్య ట్వీట్ చేశారు. కెనడా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల నుంచి జనం దృష్టిని మరల్చడం కోసం కెనడా ప్రభుత్వం ఖలిస్థానీల విషయంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com