ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు ,,,గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించిన ఈసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 07:05 PM

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ శ్రేణులకు గుడ్ న్యూస్. జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కిందటిసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు గ్లాస్ గుర్తు పైనే పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. అయితే, ఈ ఏడాది మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటిస్తూ.. జనసేన పార్టీ గ్లాస్ గుర్తును కోల్పోయినట్లు ప్రకటించింది. గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ చేస్తున్నట్లు నాడు ఎన్నికల సంఘం తెలిపింది.


కేంద్ర ఎన్నికల సంఘం జనసేన ఎన్నికల గుర్తును తొలగించిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నేతలపై విమర్శలు చేశారు. పవన్ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికంటే ముందు ఆయన పార్టీ గుర్తు ఏంటో చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. అసలు ఎన్నికల్లో నేరుగా పోటీ చేస్తారా, లేదా చెప్పాలని నిలదీశారు. గాజు గ్లాస్ గుర్తును తిరిగి దక్కించుకుంటామని నాడు జనసేనాని పవన్ కళ్యాణ్ దీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గాజు గ్లాస్ గుర్తును తిరిగి దక్కించుకోవడంతో జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.


‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు సేవ చేసేందుకు జనసేన అభ్యర్థులు సిద్ధమైన తరుణంలో రిజిస్టర్ పార్టీ అయిన జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గుర్తును కేటాయించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, యావన్మంది సిబ్బందికి పేరుపేరునా నా తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు’ అంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ఇటీవల రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com