ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత్ 1-4తో కోల్పోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. టెస్టు సిరీస్కు ముందు వామప్ మ్యాచ్లు ఆడితే ఫలితం టీమిండియాకు అనుకూలంగా ఉండేదని మాజీలు అభిప్రాయపడ్డారు. కోహ్లీసేన త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో సిరీస్ ఆరంభానికి ముందు వామప్ మ్యాచ్లను ఆడాలనుకుంటున్నట్లు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్కు ముందు ఎక్కువ సన్నాహక మ్యాచ్లు ఏర్పాటు చేయాలని బీసీసీఐని కోరినట్లు శుక్రవారం శాస్త్రి వెల్లడించాడు.
శాస్త్రి వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. భారత్ జట్టు కోసం మరిన్ని వామప్ మ్యాచ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రాక్టీస్ మ్యాచ్ల విషయంలో ఉన్న అవకాశాలపై బీసీసీఐతో చర్చించడానికి సంతోషంగా ఉన్నాం. ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా ఆడనున్న సన్నాహాక మ్యాచ్లను పెంచాలని బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని సీఏ ప్రతినిధి పేర్కొన్నారు. మూడు లేదా నాలుగు రోజుల మ్యాచ్లు ఒకటి రెండు ఎక్కువ ఆడాల్సి వస్తే తీరిక లేని షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశం ఉంది.