జిల్లాలో ఏటా వందల సంఖ్యలో ఉంటున్న శిశు మరణాల సంఖ్య వైద్యశాఖ నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతోంది. ప్రభుత్వ డొల్లతనాన్ని కూడా వెల్లడిస్తోంది. శిశుమరణాల నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నామనిరాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. శిశు మరణాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతోంది. 0 నుండి 5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులు పలు రకాల కారణాలతో ఇంకా వందల సంఖ్యలో ఏటా మృత్యువాత పడుతూనే ఉన్నారు. ఇటీవల ఉమ్మడి హైకోర్టు శిశు మరణాలపై స్పందిస్తూ శిశు మరణాలు తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది.
మరణాల పెరుగుదలకు కారణాలు
శిశు మరణాల పెరుగుదలకు అనేక కారణాలను వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం, రక్త హీనత, సరైన పోషకాహారం అందకపోవడం, వంశపారంపర్యంగా వచ్చే లోపాలు వల్ల ఈ మరణాలు అధికంగా ఉంటున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు, తల్లులకు పూర్తిస్థాయిలో పోషకాహారం అందకపోవడం మరో కారణంగా చెబుతున్నారు.
బాల్యవివాహాలు కూడా
జిల్లాలో బాల్య వివాహాలను అరికడుతున్నామని జిల్లా యంత్రాంగం చెబుతున్నా ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారం అందిన వెంటనే అంగన్వాడీ సూపర్ వైజర్, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం, స్థానిక పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓలు వెళ్లి వాటిని ఆపినా అవి తాత్కాలికమే. ఒక ప్రాంతంలో జరిగే దాన్ని ఆపితే కొద్ది రోజులు పోయిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లి పెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు. అంటే బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో సంబంధిత శాఖ వైఫల్యం పూర్తిగా కన్పిస్తుంది.