న్యూఢిల్లీ: తన స్నేహితుడు ఇమ్రాన్ఖాన్ ప్రమాణస్వీకారం కోసం పాకిస్థాన్ వెళ్లడాన్ని మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవ్జోత్ సింగ్ సిద్ధూ సమర్థించుకున్నారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్ను ఆలింగనం చేసుకోవడంపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు. తనకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజే స్వయంగా ఫోన్ చేసి పాక్ వెళ్లడానికి ప్రభుత్వం అనుమతిచ్చినట్లు చెప్పారని సిద్ధూ వెల్లడించారు. నాకు పదిసార్లు ఆహ్వానం అందింది. నేను భారత ప్రభుత్వ అనుమతి కోరాను. కానీ అనుమతి దొరకలేదు. పాకిస్థాన్ వీసా జారీ చేసిన రెండు రోజుల తర్వాత సుష్మా స్వరాజ్ స్వయంగా కాల్ చేసి మీకు అనుమతి లభించిందని చెప్పారు అని సిద్ధూ వివరించారు. దీనిపై ఇప్పటికే పంజాబ్ సీఎం అమరీందర్తోపాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు స్పందించారని సిద్ధూ అన్నారు.
అయితే పాక్ ఆర్మీ చీఫ్ను సిద్ధూ హత్తుకోవడాన్ని మాత్రం తాను సమర్థించబోనని అమరీందర్సింగ్ స్పష్టంచేశారు. పాక్ ఆర్మీ చీఫ్పై అంత ప్రేమ చూపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి రోజూ పాక్ చేతిలో మన జవాన్లు మృత్యువాత పడుతున్నారు. అలాంటి ఆర్మీ చీఫ్ను హత్తుకోవడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయాన్ని సిద్ధూ గమనించాలి అని అమరీందర్ అన్నారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవంలో సిద్ధూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ చీఫ్ పక్కనే కూర్చోవడంపైనా విమర్శలు వచ్చాయి. దీనిని జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్ కూడా తప్పుబట్టారు.