చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరీ ఆస్పత్రి ఇవాళ సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. తీవ్ర అనారోగ్య కారణాలతో పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి దవాఖానలో కరుణానిధి చేరిన సంగతి తెలిసిందే.కాసేపటి క్రితం సీఎం పళనిస్వామితో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ టీకే రాజేంద్రన్ సమావేశమై కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై చర్చించారు. అంతకుముందు పళనిస్వామిని స్టాలిన్ కలిసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. సీఎం పళినిస్వామితో డీజీపీ భేటీ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
తక్షణమే పోలీసు కమిషనర్లు, డీఐజీలు, ఎస్పీలు విధుల్లోకి రావాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కావేరీ ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భద్రతను మరింత పెంచారు. ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక కావేరీ ఆస్పత్రి వద్దకు కరుణానిధి అభిమానులు, డీఎంకే నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.