విజయవాడ : సంచలనం సృష్టించిన నాగ వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు దోషులకూ జీవిత ఖైదు విధించిన విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు చాలా అరుదుగా మాత్రమే ఉపయోగించే టిల్ డెత్ అన్న మాటను ఉపయోగించింది. అంటే దోషులు ముగ్గురూ జీవించి ఉన్నంత వరకూ జైలులోనే ఉండాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసులో హైకోర్టులో ఆర్డర్ మోడిఫై అయితే తప్ప జీవించి ఉన్నంత వరకూ జైలులోనే ఉండాలన్నది తీర్పు సారాంశం. ఎనిమిదిన్నర సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్, పంది వెంకట్రావుకు జీవితఖైదు విధించింది కోర్టు. పంది వెంకట్రావు పలగాని ప్రభాకర్ రావుకు బావమరిది. ముగ్గురు దోషులకు జీవితఖైదు విధించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగవైష్ణవి కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగిందని పలువురు పేర్కొంటున్నారు.