అమరావతి : విభజన హక్కుల కోసం కేంద్రంపై పోరాడేది తామేనని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ప్రధానిని ప్రశ్నించాల్సిన జగన్, చంద్రబాబును ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్షాలు మోడీకి అక్కడేమో వ్యతిరేకమంటాయి, ఇక్కడ అఖిల సంఘానికి దూరమంటాయన్నారు. వామపక్ష నేతల విధానమేంటో ఎవరికీ అర్థం కాదన్నారు. హక్కుల సాధన కోసం కేంద్ర మంత్రి పదవులను వదులుకున్న పార్టీ మాదేనని సోమిరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారని, ఈ సమావేశానికి కొన్ని పార్టీలు కుమ్మక్కై సమావేశానికి రాలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కొన్ని పార్టీలు కుమ్మక్కై సమావేశానికి రాకుంటే ఎలాంటి నష్టం లేదని చాలా సంఘాలు సమావేశానికి వచ్చాయన్నారు. ప్రజల మద్దతు మా పక్షాననే ఉందని మంత్రి తెలిపారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనప్పుడు.. సమావేశం ఏర్పాటు చేయాలంటారు.. తీరా ఇప్పుడు సమావేశానికి రమ్మంటే.. ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తామని అంటున్నారని మంత్రి అన్నారు.