భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్న చిన్న కేసులకే జైళ్లలో మగ్గిపోతున్న వ్యక్తులకు సహాయం చేయాలని వారిని ఆదుకోవాలని కోర్టులను కోరారు. అలాంటి వారికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధుల గురించి తెలియదన్నారు. ఢిల్లీ సుప్రీంకోర్టు నిర్వహించిన రాజ్యంగ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. హంతకుల్లో కొందరు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే, చెంపదెబ్బ కొట్టడం వంటి చిన్న చిన్న కేసుల్లో నమోదైన వారు జైళ్లలో మగ్గుతున్నారని అన్నారు. జైళ్ల సంఖ్యను పెంచే బదులు అసలు జైళ్ల అవసరం ఏంటనే కోణంలో ఆలోచించాలని ఆమె సూచించారు.