- అట్టహాసంగా జరిగిన వాకాటి నామినేషన్ కార్యక్రమం
-తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు
-అభ్యర్థి గెలుపు పై ఇన్ఛార్జి మంత్రి శిద్ధా సమాలోచన
నెల్లూరు, మేజర్న్యూస్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్ధా రాఘవరావు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాకాటి నారాయరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ అభ్యర్ధులతో పాటు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధుల విజయానికి పార్టీ నాయకులు కష్టపడి పని చేయాలన్నారు. ముగ్గురిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. అంతకు ముందు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రి శిద్ధా పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం నెల్లూరు జిల్లా స్థాయిన సంస్థల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసిన వాకాటి నారాయణరెడ్డి పరిచయ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు కార్పోరేటర్లు, నెల్లూరు రూరల్ ఎంపిటీసీలు, జడ్పీటీసీలు ఆదాల ప్రభాకర్రెడ్డి ఇంట్లో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వాకాటి నారాయణరెడ్డిని గెలుపించుకోవాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లో రోడ్ల నిర్మానం చేపట్టిన ఘనత మన పార్టీకే సాధ్యమైందన్నారు. అనంతరం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భా.జ.పా. పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గెలుపుకు కృషి చేయాలని కోరారు.