ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్‌లోనే శ్రీదేవి మృత‌దేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 02:18 PM

దుబాయ్: సూపర్‌స్టార్ శ్రీదేవి చనిపోయి 36 గంటలు గడుస్తున్నది. ఆమె పార్ధీవ‌దేహం ఇంకా దుబాయ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లోనే ఉన్నది. దుబాయ్ కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నాం శ్రీదేవి భౌతికకాయాన్ని అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దుబాయ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ ముందు శ్రీదేవి అభిమానులు ఆమెను కడసారి చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ శ్రీదేవికి నిర్వహించిన రక్త పరీక్షల నివేదికలను ఇంకా పోలీసులకు అందించలేదు. దుబాయ్ పోలీసులకు నివేదికలు అందిన తర్వాతనే .. ఇమ్మిగ్రేషన్, పాస్‌పోర్ట్, ఎంబాల్మింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే పోస్టు మార్టమ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం జరుగుతుందన్న విషయాన్ని ఎవరూ వెల్లడించడంలేదు. మరికొన్ని గంటల్లో డాక్టర్లు.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను ఇవ్వనున్నారు. ఆ తర్వాతే తదుపరి లాంఛనాలు ఉంటాయి. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత క్లియరెన్స్ కోసం కనీసం మరో మూడు గంటల సమయం పడుతుందట.


అయితే ఆమె మృతదేహం మాత్రం ఇంకా దుబాయ్‌లోనే ఉంది. ఫోరెన్సిక్ పరీక్షలు మరింత ఆలస్యమవుతూనే ఉన్నాయి. ఆమె రక్తపరీక్షకు సంబంధించిన రిపోర్ట్‌ను ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఇంకా పోలీసులకు ఇవ్వలేదు. ఈ రిపోర్ట్ ఇవ్వడంలో ఎందుకింత ఆలస్యమవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి మరో రెండు గంటల సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాతే పోలీసులు ఆమె మృతదేహాన్ని అప్పగించే వీలుంటుంది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే శ్రీదేవి మృతికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయి. ఇప్పటికే టాక్సికాలజీ డిపార్ట్‌మెంట్ ఆమె రక్తం, శరీరభాగాలపై పరీక్షలు నిర్వహించింది. వీటి నివేదిక వస్తే శ్రీదేవి మరణానికి కారణం తెలుస్తుంది. ఒకవేళ మరణం అసహజమని తేలితే మాత్రం దీనిపై తదుపరి విచారణ జరుపుతారు. అదే జరిగితే మృతదేహం అప్పగింత మరింత ఆలస్యమవుతుంది. నిజానికి యూఏఈ నిబంధనల ప్రకారం కనీసం 24 గంటల సమయం పడుతుందని నిన్న చెప్పారు. కానీ ఇప్పటికే 36 గంటలు దాటింది. అయినా కనీసం రక్త పరీక్షల రిపోర్టు కూడా ఎందుకు బయటకు ఇవ్వడం లేదన్నది అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఆలస్యం చూస్తుంటే.. ఇవాళ కూడా శ్రీదేవి అంత్యక్రియలు జరిగేది అనుమానమే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com